ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో ఎన్టీఆర్ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘జై’ పోస్టర్, టీజర్ను విడుదల చేశారు. ఇటీవల ‘లవ’ పోస్టర్ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాలకు సోషల్మీడియాలో విశేషమైన స్పందన లభించింది.
ఈ చిత్రానికి పవర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. కల్యాణ్రామ్ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల తేదీ వాయిదా పడిందని ఇటీవల వార్తలొచ్చాయి. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ స్పందించింది. సినిమా వాయిదాపై వచ్చిన వార్తలన్నీ కేవలం పుకార్లని పేర్కొంది. అనుకున్న తేదీ సెప్టెంబరు 21న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని చెప్పింది. ‘లవ’ పాత్రకు సంబంధించిన టీజర్ను కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.